Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
గోదావరి తీరాన పుట్టి, ఆ గోదారమ్మ నీళ్ళు తాగి, ఆ అమ్మ ఒడిలో పెరిగి, ఆ చల్లని తల్లి దీవెనలతో ఎదిగిన ఎందరో మహానుభావులు తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు వన్నె తెచ్చారు. తెలుగు సాహిత్యానికి కొత్త భాష్యం చెప్పారు. తెలుగు కవిత్వానికి సరైన నిర్వచనాన్ని అందించారు. ఆ గోదారమ్మ ఒడిలో పుట్టినందుకో, అటువంటి మహానుభావులు వ్రాసిన కవిత్వాలు, కథలు చదివినందుకో తెలియదు కానీ నాకు తెలుగు సాహిత్యం మీద మక్కువ ఏర్పడింది. ఆ మక్కువే నేను కథలు, కవితలు వ్రాయడానికి నాంది అయ్యింది.అలా ఆరంభించిన తొలి ప్రయత్నంలోనే నేను వ్రాసిన మొదటి కథ 'కాలానికి బ్రేకులుంటే' ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమవ్వడం నా అదృష్టం. ఆ ప్రచురణ, కథలు వ్రాయాలనే నా ఉత్సాహాన్ని, జిజ్ఞాసను రెట్టింపు చేసింది. ఆ రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని కథలు, కవితలను వ్రాయడం కొనసాగించాను. అలా వంద పై చిలుకు కథలను, నూట యాభై పై చిలుకు కవితలను వ్రాసాను. నా అదృష్టమేమో గానీ, నేను వ్రాసిన కథలు, కవితలలో సింహభాగం రచనలు వివిధ పోటీల్లో గెలిచి అనేక పత్రికల్లో, అంతర్జాల సంచికల్లో ప్రచురితమవ్వడం జరిగింది, జరుగుతోంది.'రవి మయూఖాలు' లో పన్నెండు కథలు తీసుకోవడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. భానుని లేత కిరణాల నులివెచ్చని మేలుకొలుపుతో మన దినచర్య ప్రారంభమవుతుంది. ఆ సూర్యుని పలకరింపు లేకపోతే ఆ రోజు మనకు పొద్దుపోయినట్టు ఉండదు. అలా మనల్ని మేల్కొలిపి, మనతో పాటే పనిచేస్తూ, చీకట్లను చీల్చి, నిర్విరామమైన వెలుగునిస్తున్న ఆ ఆదిత్యునికి పన్నెండు రూపాలు. వాటినే మనం ద్వాదశాదిత్యులు అంటాం. ఆ దినకరుడికి కృతజ్ఞతా పూర్వకంగా నేను పన్నెండు కథలను తీసుకోవడం జరిగింది.