చరిత్ర చదివితే స్ఫూర్తి కలుగుతుంది. మనది ప్రాచీన భాష. మన గురించి తెలుసుకోవాలంటే మొదటిగా తెలుగు భాషతత్త్వం గురించి తెలుసుకోవాలి. తత్వవేత్త తమ కలం కంటే ముందు ఉంటాడు. ద్రష్ట అంటే చూసేవాడు, మనస్సు చేత కనుగొనేవాడు, గుణ దోషాలను తెలుసుకొనగలవాడు, నిర్ణయ కర్త. ద్రష్ట అయిన వాడే సాహిత్య స్రష్ట కాగలడు.మన పరిశీలన, విమర్శ, చరిత్రలో జరిగిన విషయాల మీదనే కానీ, ఏ వ్యక్తిమీద కాదు. ఇతరులకు తెలిసినట్లు మన లోపాలు మనకు తెలియవు. విదేశీయులు గుర్తించినట్లు మన చరిత్ర, సాహిత్య సంపదను ఆదిలో మనం గుర్తించ లేకపోయాం. కొందరు భారతీయులు, మెకంజీ మనకు చరిత్ర రాసిపెట్టాడని అనడం బాధాకరం. మన బ్రాహ్మణ నియోగులు, స్థానిక చరిత్రలను గ్రామ కైఫీయతులుగా కొంత రాసి ఉంచారు. దానిని ఓ సారి గుర్తుచేయాలన్న తపనతో, నా ఈ చిరు ప్రయత్నం. ఈ పుస్తకం నాలో గడ్డకట్టిన చెడుని వైద్యుడు తొలగించినట్టు తొలగించిందేమో!! ’అంత పెద్ద పుస్తకం చంకలో ఉంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు’ నా చుట్టూ మంచితో కూడిన ఇంత పెద్ద ప్రపంచం ఉంటే, చిన్నచిన్న చారిత్రాత్మక విషయాలను మీ అందరి ముందుకు తీసుకురాలేనా అన్న తాపత్రయంతో చేసిన సాహసమిది.చరిత్ర పరిశోధనలో సత్యాన్ని నిర్ణయించడం ప్రధానం. భారతదేశంలోని, తెలుగు వారైన పాకనాటి చారిత్రక యదార్థాలను కొద్ది నాటకీయతతో మేళవించి, నాలుగు యుగాల కాలాన్ని చారిత్రక దృక్పథంతో ఏడు అధ్యాయాలలో, ఏడు తరాలుగా అసలేం జరిగిందన్నది, ఆధారాలతో చెప్పే ప్రయత్నమిది. మన గ్రామ లేదా రాష్ట్ర లేదా దేశ చరిత్రను మనమెందుకు తిరిగి పునర్జీవం చేసుకోకూడదన్న ప్రయత్నంలో భాగంగా, చరిత్రలోకి వెళ్దాం. దాచలేదు..........దాచలేదు.......... వక్రీకరించలేదు ఇది. ఆది పాకనాటి మహోజ్జ్వల చరిత్ర. మానవత్వపు మనస్సు తెరిచి చదువుడో విశ్వనరుడా!